Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ మడతరమేష్ 

Published

on

నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ ఎం రమేష్

 

బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని మే 11

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నేరచరిత్ర, జీవన విధానం, ఉద్యోగ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవివర్మ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ లావణ్య

Published

on

బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీటీమ్ ఆధ్వర్యంలో జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్ ఇంచార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, కళాశాలల వద్ద షీటీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందన్నారు. వేధింపులకు గురైతే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సైబర్ మోసాలు, లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో షీటీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత పాల్గొన్నారు.

Continue Reading

crime

ప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్

Published

on

బిబిఎంఏ న్యూస్/ 8 ఇంక్లైన్ కాలనీ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-II టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి టాటా జెస్ట్ కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. సోమవారం గోదావరిఖని-II టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావుతో కలిసి ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ ఈ నెల 29న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోవడంతో, అతని తల్లి జూల శంకరమ్మ మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీడీఆర్, మొబైల్ కాల్ వివరాలను పరిశీలించగా అలేఖ్య, నీలం నవీన్, బుర్ర భాస్కర్‌లపై అనుమానం వ్యక్తమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. వంశీ, అలేఖ్య పదో తరగతి సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అలేఖ్య నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల వంశీ అలేఖ్యను తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడంతో పాటు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి గొడవలకు దిగినట్లు తెలిసింది. దీంతో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని పథకం రచించారు.

పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్‌కు రప్పించారు. భాస్కర్ ఫ్లాట్‌లో మద్యం తాగించిన అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో ఛాతి, మెడ భాగాల్లో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మంథని మండలం గాడుదులగండి ప్రాంతంలోని లోయలో పడవేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు.

Continue Reading

crime

అతివేగం బలి.. మహబూబ్‌నగర్‌లో ఐదుగురు మృతి

Published

on

యువకుల బైక్ రేసింగ్ సరదా.. ఐదుగురి ప్రాణాలు బలి

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అతివేగం, బైక్ రేసింగ్‌లే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. స్పోర్ట్స్ బైక్ సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక బైపాస్ రోడ్డు బైక్ రేసింగ్‌లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Continue Reading

Trending