Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

రామగుండం కార్పొరేషన్‌లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య

Published

on

మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ 

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు అవినీతి అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక భాస్కరరావు భవన్‌లో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

 

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధికి అధికారుల పాత్ర కీలకమైనప్పటికీ, ప్రస్తుతం సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. 60 డివిజన్లకు అవసరమైన 257 పోస్టుల్లో కేవలం 113 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, 144 పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రజలకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు.

 

ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాటు, డీఈలు, ఏఈల కొరత కారణంగా అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. అలాగే పబ్లిక్ హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో పరిపాలన దెబ్బతింటోందన్నారు.

 

టౌన్ ప్లానింగ్ విభాగంలో రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

రామగుండంలో మాస్టర్ ప్లాన్‌ను ముందుగా ప్రజలకు వెల్లడించి, రహదారుల వెడల్పు, అభివృద్ధి ప్రణాళికపై స్పష్టత ఇచ్చిన తర్వాతే నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేస్తే సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.

 

ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, ఆశాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, కౌన్సిల్ సభ్యులు రాణవేణి సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం, తిరుమల, నాయకులు పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

మద్యం మత్తులో విధులకు హాజరైన ఉపాధ్యాయుడు సస్పెండ్

Published

on

చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి మద్యం మత్తులో హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడు కె.వి. రమణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడే ఉద్యోగులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Continue Reading

News

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

Published

on

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

 

ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు హెల్ప్‌లైన్.. 040-24603572 ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Published

on

హైదరాబాద్ నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కాల్‌సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో 040-24603572 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన మంత్రి, ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. రూ.10 వేల EMDని UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, ఇల్లు కేటాయించబడకపోతే అదే బ్యాంకు ఖాతాకు మొత్తం తిరిగి జమ అవుతుందని స్పష్టం చేశారు.

 

క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తూ, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండి, సొంత ఇల్లు లేదా స్థలం లేని కుటుంబాలు అర్హులని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు స్వీకరిస్తామని, అవసరమైతే పారదర్శక లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.

ఈ పథకం కింద 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20–25 గజాల అవిభాజ్య స్థల హక్కును లబ్ధిదారుడి పేరిట నమోదు చేస్తుందని, లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending