Entertainment
ఘనంగా ‘రీ-బర్త్’ హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలు
జూలై 18:గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో అసవి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత అశోక్ వేముల నిర్మిస్తున్న సందేశాత్మక చిత్రం ‘రీ-బర్త్’ షూటింగ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. దర్శకుడు కొత్తూరు ప్రసాద్ చారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల హీరోగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అశోక్ వేముల మాట్లాడుతూ శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ప్రతిభావంతమైన నటి మాత్రమే కాకుండా సమాజ సేవ పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సినీ రంగంలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హీరోయిన్ శ్రీలత నేత మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘రీ-బర్త్’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందుతోందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఓపీ దేవా, సహ దర్శకుడు రతన్ కుమార్, మేకప్ ఆర్టిస్టు అంజిబాబు, లక్ష్మణ్, నాగేష్, అప్రోజ్, ఫిరోజ్, సీనియర్ నటులు కనకా రెడ్డి, శిరీష, మేకల శ్రీకాంత్, చెర్రీ బాబు తదితరులు పాల్గొని శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Entertainment
ఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ఐబీ కాలనీ లో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి ఆలయం & నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15 బుధవారం నుండి నెల రోజులపాటు నిర్వహించు ఆషాడ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజ్ కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి కృపను పొందగలరని ఆలయ కమిటీ కోరుతుంది. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యార్థం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Entertainment
తమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
బిబిఎంఏ న్యూస్ / చెన్నై మే 10
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య విజయ్ సీఎం పదవిని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు కొంత సమయం అవసరమని ప్రజలను కోరుతూ, ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తన పాలన పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేసిన విజయ్, మహిళల భద్రత, డ్రగ్స్ రహిత సమాజం, అవినీతి నిర్మూలన, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ “విద్యార్థులకు విజయ్ మామ ఎప్పుడూ అండగా ఉంటాడు” అని అన్నారు. తమిళనాడులో ప్రజల ప్రభుత్వం ఏర్పడి కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విజయ్ వ్యాఖ్యానించారు.
Entertainment
సినీ ప్రపంచం నుంచి సీఎం పీఠం వరకూ..
సినీ ప్రపంచం నుంచి సీఎం పీఠం వరకూ..
దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం – తమిళ రాజకీయాల్లో కొత్త శకం
చెన్నై, బిబిఎంఏ న్యూస్:
తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో సినీ అధ్యాయం ఆవిష్కృతమైంది. వెండితెరపై కోట్లాది అభిమానులను సంపాదించిన ‘దళపతి’ విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్, ప్రజాదరణను రాజకీయ శక్తిగా మలుచుకుని అధికారానికి చేరుకోవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎంజీఆర్, జయలలిత తర్వాత మరో సినీ నటుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతుండటం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
సినీ కుటుంబంలో జన్మించిన విజయ్
పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కాగా తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయని. చిన్ననాటి నుంచే కళారంగ వాతావరణంలో పెరిగిన విజయ్కు సినిమాలపై ఆసక్తి సహజంగానే పెరిగింది. తండ్రి దర్శకత్వంలో చిన్న పాత్రలతో తెరపై కనిపించిన విజయ్, తర్వాత హీరోగా ఎదిగి తమిళ సినీ ప్రపంచంలో అగ్రస్థానాన్ని అందుకున్నారు.
హీరోగా ఆరంభం.. స్టార్డమ్కు ఎదుగుదల
1992లో విడుదలైన ‘నాలయ తీర్పు’ చిత్రంతో విజయ్ హీరోగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా తన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1990ల చివరలో ‘కాదలుక్కు మరియాధై’, ‘తుల్లాద మనముమ్ తుల్లుం’ వంటి ప్రేమకథా చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించిన విజయ్, తర్వాత యాక్షన్ హీరోగా మారి తమిళ బాక్సాఫీస్ను శాసించారు.
‘గిల్లి’, ‘పోక్కిరి’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘మాస్టర్’, ‘లియో’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించి తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా నిలిచారు. తమిళనాడులో ఆయన సినిమా విడుదలైతే అభిమానులు థియేటర్ల వద్ద పాలు పోసి పోస్టర్లకు పూజలు చేసే స్థాయికి ఆయన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు విజయ్ను ప్రేమగా “దళపతి” అని పిలవడం ప్రారంభించారు.
అభిమాన సంఘాలే రాజకీయ బలం
విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన బలం ఆయన అభిమాన సంఘాలే. తమిళనాడులో గ్రామ స్థాయి వరకు విస్తరించిన అభిమాన సంఘాలను ఆయన క్రమంగా సేవా కార్యక్రమాల వైపు మళ్లించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, వరద బాధితులకు సాయం, పేదలకు ఆర్థిక తోడ్పాటు వంటి కార్యక్రమాలతో అభిమాన వర్గాన్ని సామాజిక శక్తిగా మార్చారు.
ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విజయ్కు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ముఖ్యంగా యువతలో ఆయనకు విపరీతమైన ఆదరణ పెరిగింది. సినిమాల్లో కూడా విద్యా వ్యవస్థ, అవినీతి, నిరుద్యోగం, సామాజిక అసమానతలపై పరోక్ష సందేశాలు ఇస్తూ వచ్చిన విజయ్ రాజకీయ ప్రవేశానికి పునాది వేసుకున్నారు.
రాజకీయాల్లో అధికారిక ఎంట్రీ
కొన్నేళ్లుగా రాజకీయ ప్రవేశంపై చర్చలు సాగుతుండగా 2024లో విజయ్ అధికారికంగా ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని స్థాపించారు. “ప్రజలే నా బలం” అనే నినాదంతో యువత, మధ్యతరగతి, మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు.
టీవీకే పార్టీ ప్రధాన అజెండాలో అవినీతి రహిత పాలన, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, యువతకు ఉద్యోగాలు, మహిళా భద్రత, రైతు సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా సోషల్ మీడియా, అభిమాన సంఘాలు, యువజన బృందాలను సమర్థంగా వినియోగిస్తూ విజయ్ పార్టీని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
డీఎంకే – అన్నాడీఎంకేలకు సవాల్
దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో టీవీకే అద్భుత ఫలితాలు సాధించడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేసిన వర్గాలు విజయ్ వైపు ఆకర్షితులయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా, విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ బలం 107కు చేరింది. అనంతరం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతు లభించడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నారు.
రాజకీయ హైడ్రామా తర్వాత గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుపై ఐదు రోజులపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మద్దతు లేఖల సేకరణ, మిత్రపక్షాలతో చర్చలు, ప్రభుత్వ ఏర్పాటు అంశం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చివరకు మిత్రపక్షాల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు సమర్పించిన విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం అందించారు.
దీంతో చెన్నై నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొలి విడతలో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్కు కీలక ప్రాధాన్యం
ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకంగా మారడంతో కొత్త మంత్రివర్గంలో ఆ పార్టీకి మూడు మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలను సమతూకంగా తీసుకెళ్లేందుకు విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరి సినిమా.. రాజకీయాలకే పూర్తి సమయం
రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగేందుకు విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించారు. దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కిస్తున్న ‘జననాయగన్’ ఆయన చివరి చిత్రం కానుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుండగా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముందున్న సవాళ్లు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విజయ్కు చారిత్రాత్మక ఘట్టమైనప్పటికీ అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, పరిశ్రమల అభివృద్ధి, విద్యా వ్యవస్థ, మిత్రపక్షాల సమన్వయం వంటి అంశాలు కొత్త ప్రభుత్వానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి.
అయితే సినీ రంగంలో ప్రజల ప్రేమను సంపాదించిన విజయ్ రాజకీయాల్లో కూడా అదే స్థాయి ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటారా? తమిళనాడుకు కొత్త దిశ చూపిస్తారా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనుంది.
-
crime2 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
crime5 days ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana1 week agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News15 hours agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment5 days agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News1 week agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News7 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
