Politics
అంధ క్రికెటర్ల వేదనకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ — మాటిచ్చిన 24 గంటల్లో సాయం, అభివృద్ధి చర్యలు
అంధ క్రికెటర్ల వేదనకు చలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•24 గంటల్లో ప్రపంచకప్ విజేతల కుటుంబాలకు గృహోపకరణాలు
•అంధ క్రికెటర్ల ఇళ్లలో వస్తు కాంతులు
•తంబలహట్టి తండా, వంట్ల మామిడి గ్రామాలకు వెళ్ళి అందించిన జనసేన నాయకులు, యంత్రాంగం
•నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని పేషీకి దిశానిర్దేశం
•ఇప్పటికే కెప్టెన్ దీపిక స్వగ్రామానికి రూ.6.2 కోట్లతో రెండు రోడ్లు మంజూరు
ఎవరు సమస్య చెప్పుకున్నా మనసు పెట్టి విని, స్పందించి తక్షణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది ప్రభుత్వపరంగా చూపే పరిష్కారం అయినా, వ్యక్తిగతంగా ఇచ్చే భరోసా అయినా గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటారు. కష్టం వింటే కరిగిపోతారు. అంధుల క్రికెట్ లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలసిన సందర్భంలో వారి కుటుంబాల దైన్య స్థితి విని చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు చలించిపోయారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికీ టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్.ఇ.డి. బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు లాంటివి అందించారు. కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ శ్రీ టి.సి. వరుణ్, శ్రీ పొదిలి బాబూరావు, శ్రీ కుమ్మరి నాగేంద్ర, శ్రీ ఆకుల ఉమేశ్, శ్రీ అంకె ఈశ్వరయ్య, డి.మణిప్రియ, శ్రీమతి శ్రీదేవి, శ్రీ ఆనంద్ తదితర జనసేన నేతలు తంబలహట్టి తండాకు వెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన వస్తు సామాగ్రిని అందజేశారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్న కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, జనసేన నేతలు శ్రీ పి.శివ ప్రసాద్, శ్రీ కె.రామారావు, శ్రీ ఎన్ మురళీకృష్ణ చేతుల మీదుగా అందించారు.
•మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు..
శుక్రవారం మధ్యాహ్నం జట్టు శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసిన సందర్భంలో దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే రెండు రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు రహదారులు మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కదిలిన అధికారులు హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమవతికి వెళ్లే రహదారికి రూ. 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు అవసరం అని అంచనాలు రూపొందించారు. ఈ రెండింటికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
•24 గంటల్లో నూతన గృహోపకరణాలు, నిత్యావసరాలు ఏర్పాటు
దీపిక, కరుణ కుమారి వేదనకు చలించిపోయి వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసరాలను తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు పంపించారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు.
crime
ప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
బిబిఎంఏ న్యూస్/ 8 ఇంక్లైన్ కాలనీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-II టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి టాటా జెస్ట్ కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. సోమవారం గోదావరిఖని-II టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్రావుతో కలిసి ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ ఈ నెల 29న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోవడంతో, అతని తల్లి జూల శంకరమ్మ మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీడీఆర్, మొబైల్ కాల్ వివరాలను పరిశీలించగా అలేఖ్య, నీలం నవీన్, బుర్ర భాస్కర్లపై అనుమానం వ్యక్తమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. వంశీ, అలేఖ్య పదో తరగతి సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అలేఖ్య నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల వంశీ అలేఖ్యను తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్లతో వేధించడంతో పాటు ఆమె ఫ్లాట్కు వెళ్లి గొడవలకు దిగినట్లు తెలిసింది. దీంతో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని పథకం రచించారు.
పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్కు రప్పించారు. భాస్కర్ ఫ్లాట్లో మద్యం తాగించిన అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో ఛాతి, మెడ భాగాల్లో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మంథని మండలం గాడుదులగండి ప్రాంతంలోని లోయలో పడవేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు.
Entertainment
తమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
బిబిఎంఏ న్యూస్ / చెన్నై మే 10
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య విజయ్ సీఎం పదవిని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు కొంత సమయం అవసరమని ప్రజలను కోరుతూ, ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తన పాలన పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేసిన విజయ్, మహిళల భద్రత, డ్రగ్స్ రహిత సమాజం, అవినీతి నిర్మూలన, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ “విద్యార్థులకు విజయ్ మామ ఎప్పుడూ అండగా ఉంటాడు” అని అన్నారు. తమిళనాడులో ప్రజల ప్రభుత్వం ఏర్పడి కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విజయ్ వ్యాఖ్యానించారు.
Entertainment
సినీ ప్రపంచం నుంచి సీఎం పీఠం వరకూ..
సినీ ప్రపంచం నుంచి సీఎం పీఠం వరకూ..
దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం – తమిళ రాజకీయాల్లో కొత్త శకం
చెన్నై, బిబిఎంఏ న్యూస్:
తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో సినీ అధ్యాయం ఆవిష్కృతమైంది. వెండితెరపై కోట్లాది అభిమానులను సంపాదించిన ‘దళపతి’ విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్, ప్రజాదరణను రాజకీయ శక్తిగా మలుచుకుని అధికారానికి చేరుకోవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎంజీఆర్, జయలలిత తర్వాత మరో సినీ నటుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతుండటం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
సినీ కుటుంబంలో జన్మించిన విజయ్
పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కాగా తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయని. చిన్ననాటి నుంచే కళారంగ వాతావరణంలో పెరిగిన విజయ్కు సినిమాలపై ఆసక్తి సహజంగానే పెరిగింది. తండ్రి దర్శకత్వంలో చిన్న పాత్రలతో తెరపై కనిపించిన విజయ్, తర్వాత హీరోగా ఎదిగి తమిళ సినీ ప్రపంచంలో అగ్రస్థానాన్ని అందుకున్నారు.
హీరోగా ఆరంభం.. స్టార్డమ్కు ఎదుగుదల
1992లో విడుదలైన ‘నాలయ తీర్పు’ చిత్రంతో విజయ్ హీరోగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా తన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1990ల చివరలో ‘కాదలుక్కు మరియాధై’, ‘తుల్లాద మనముమ్ తుల్లుం’ వంటి ప్రేమకథా చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించిన విజయ్, తర్వాత యాక్షన్ హీరోగా మారి తమిళ బాక్సాఫీస్ను శాసించారు.
‘గిల్లి’, ‘పోక్కిరి’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘మాస్టర్’, ‘లియో’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించి తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా నిలిచారు. తమిళనాడులో ఆయన సినిమా విడుదలైతే అభిమానులు థియేటర్ల వద్ద పాలు పోసి పోస్టర్లకు పూజలు చేసే స్థాయికి ఆయన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు విజయ్ను ప్రేమగా “దళపతి” అని పిలవడం ప్రారంభించారు.
అభిమాన సంఘాలే రాజకీయ బలం
విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన బలం ఆయన అభిమాన సంఘాలే. తమిళనాడులో గ్రామ స్థాయి వరకు విస్తరించిన అభిమాన సంఘాలను ఆయన క్రమంగా సేవా కార్యక్రమాల వైపు మళ్లించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, వరద బాధితులకు సాయం, పేదలకు ఆర్థిక తోడ్పాటు వంటి కార్యక్రమాలతో అభిమాన వర్గాన్ని సామాజిక శక్తిగా మార్చారు.
ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విజయ్కు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ముఖ్యంగా యువతలో ఆయనకు విపరీతమైన ఆదరణ పెరిగింది. సినిమాల్లో కూడా విద్యా వ్యవస్థ, అవినీతి, నిరుద్యోగం, సామాజిక అసమానతలపై పరోక్ష సందేశాలు ఇస్తూ వచ్చిన విజయ్ రాజకీయ ప్రవేశానికి పునాది వేసుకున్నారు.
రాజకీయాల్లో అధికారిక ఎంట్రీ
కొన్నేళ్లుగా రాజకీయ ప్రవేశంపై చర్చలు సాగుతుండగా 2024లో విజయ్ అధికారికంగా ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని స్థాపించారు. “ప్రజలే నా బలం” అనే నినాదంతో యువత, మధ్యతరగతి, మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు.
టీవీకే పార్టీ ప్రధాన అజెండాలో అవినీతి రహిత పాలన, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, యువతకు ఉద్యోగాలు, మహిళా భద్రత, రైతు సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా సోషల్ మీడియా, అభిమాన సంఘాలు, యువజన బృందాలను సమర్థంగా వినియోగిస్తూ విజయ్ పార్టీని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
డీఎంకే – అన్నాడీఎంకేలకు సవాల్
దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో టీవీకే అద్భుత ఫలితాలు సాధించడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేసిన వర్గాలు విజయ్ వైపు ఆకర్షితులయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా, విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ బలం 107కు చేరింది. అనంతరం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతు లభించడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నారు.
రాజకీయ హైడ్రామా తర్వాత గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుపై ఐదు రోజులపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మద్దతు లేఖల సేకరణ, మిత్రపక్షాలతో చర్చలు, ప్రభుత్వ ఏర్పాటు అంశం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చివరకు మిత్రపక్షాల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు సమర్పించిన విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం అందించారు.
దీంతో చెన్నై నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొలి విడతలో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్కు కీలక ప్రాధాన్యం
ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకంగా మారడంతో కొత్త మంత్రివర్గంలో ఆ పార్టీకి మూడు మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలను సమతూకంగా తీసుకెళ్లేందుకు విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరి సినిమా.. రాజకీయాలకే పూర్తి సమయం
రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగేందుకు విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించారు. దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కిస్తున్న ‘జననాయగన్’ ఆయన చివరి చిత్రం కానుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుండగా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముందున్న సవాళ్లు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విజయ్కు చారిత్రాత్మక ఘట్టమైనప్పటికీ అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, పరిశ్రమల అభివృద్ధి, విద్యా వ్యవస్థ, మిత్రపక్షాల సమన్వయం వంటి అంశాలు కొత్త ప్రభుత్వానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి.
అయితే సినీ రంగంలో ప్రజల ప్రేమను సంపాదించిన విజయ్ రాజకీయాల్లో కూడా అదే స్థాయి ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటారా? తమిళనాడుకు కొత్త దిశ చూపిస్తారా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనుంది.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
