Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

Published

on

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

 

●నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక

 

●హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనర్

 

●నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ

 

కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు.

 

చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షిస్తూ.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, అవి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

 

కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి కేసుకు ఒక స్పష్టమైన ‘ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్‌, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్, మహిళా భద్రత, స్ట్రీట్ క్రైమ్, ఆహార కల్తీ కేసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించారు.

 

రౌడీ షీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెంచాలని తమ పరిధిలో ఎలాంటి నేరాలను జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్.హెచ్.ఓలదే అని స్పష్టీకరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై పి.డి.యాక్ట్ పెట్టాలని ఆదేశించారు.

 

సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలని, తద్వారా శిక్షల శాతం (కన్విక్షన్‌ రేట్‌) పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కఠిన శిక్షలు పడినప్పుడే నేరస్తుల్లో భయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు సమాజములో పెరిగి పోతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తూ , వాటిని అదుపు చేసే విధంగా సాంకేతికతను పెంపోందించుకోవాలని, నిపుణుల సహాయముతో కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు.

 

పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వెపన్ తమ వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. దీనికోసం ప్రతి 15 రోజులకోసారి వెపన్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. ప్రతి అధికారి తమ పరిధి (జురిస్డిక్షన్‌)పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని, ఎస్‌హెచ్‌ఓలు కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

 

ఈ నెలవారి నేర సమీక్ష సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్ తోపాటు వివిధ విభాగాలు, జోన్ల డీసీపీలు శ్రీమతి కె.అపూర్వా రావు ఐపీఎస్, శ్రీమతి శ్వేత ఐపీఎస్, శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్, శ్రీమతి ఎస్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్, శ్రీమతి కె.శిల్పావళి ఐపీఎస్, సి.రూపేశ్ ఐపీఎస్, శ్రీ.కె.కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్, శ్రీ.బి.బాలస్వామి ఐపీఎస్, శ్రీ.జి.చంద్రమోహన్, సిహెచ్.శ్రీనివాస్, శ్రీ.వి.అరవింద్ బాబు, శ్రీమతి పి.లావణ్య నాయక్ జాదవ్ తో పాటు అన్ని అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

Published

on

బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం

పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా

జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Continue Reading

News

అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ 

Published

on

బిబిఎంఏ న్యూస్ / తాండూరు

బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూరు–రేపల్లెవాడ అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, వాహనాల తనిఖీ విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.

అక్రమ పశు రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద రవాణా గమనించిన వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డీసీపీ వెంట తాండూరు సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూరు ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Continue Reading

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending