News
ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు
ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బిబిఎంఏ న్యూస్ : రామగుండం
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, కరుణ, శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పర మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించిన సీపీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని కోరారు.
News
అర్ధరాత్రి మసీదులు, ఈద్గాల తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ
బక్రీద్ వేడుకల కోసం మంచిర్యాలలో కట్టుదిట్టమైన భద్రత
బిబిఎంఏ న్యూస్ : మంచిర్యాల
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి సమయంలో మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో మసీదులు, ఈద్గాలు, చెక్పోస్టులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పండుగ విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడైనా చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.
బక్రీద్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీసీపీ తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
crime
ప్రియుడితో కలిసి భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య
బిబిఎంఏ న్యూస్ / సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసిన ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంఘటన నారాయణఖేడ్ మండలంలో సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి 12 ఏళ్ల క్రితం కల్పనతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు ఎల్గోయి గ్రామానికి చెందిన బేగరి పండరి అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు.
తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, చింటూ కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, ఆనవాళ్లు కనిపించకుండా రాళ్లు వేసినట్లు సమాచారం.
హత్య తర్వాత భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ డ్రామా ఆడినట్లు దర్యాప్తులో తేలింది. తొమ్మిది రోజుల విచారణ అనంతరం కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణను ముమ్మరం చేయగా.. చివరకు ఇద్దరూ నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది.
నిందితులు తెలిపిన ప్రదేశంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News
మంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్ /మంథని:
మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి సౌకర్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల వరకు బస్టాండ్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి అంశాలపై పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు తాత్కాలికంగా తాగునీటి ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే, ప్రస్తుతం ఏర్పాటు చేసిన నీటి వ్యవస్థ పరిశుభ్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ పక్కన ఉన్న బోరు నీటిని పైపుల ద్వారా పైభాగంలోని వాటర్ ట్యాంక్కు అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ ట్యాంక్ పూర్తిగా చెత్త, ధూళితో నిండిపోయి ఉండటంతో పాటు ఎలాంటి మూత లేకపోవడం వల్ల కోతులు సైతం అందులోకి చేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ నీటినే ప్రయాణికులకు తాగునీటిగా అందించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది మాత్రం తమకు మినరల్ వాటర్ తెప్పించుకొని వినియోగిస్తున్నారని, ప్రయాణికులను మాత్రం ఆరోగ్యానికి హానికరమైన నీటికి పరిమితం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కలుషిత నీటితో డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పరిశుభ్రమైన తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
-
crime2 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News2 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana5 days agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment3 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime2 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
News6 days agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
