News
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ – క్రమశిక్షణ, పారదర్శక దర్యాప్తుపై క్లియర్ సందేశం
బిబిఎంఏ న్యూస్ / అదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది నిర్వాహణ, పహారా విధులపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసింగ్లో క్రమశిక్షణ మరియు నిష్పక్షపాత వైఖరి అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఎస్పీ ఆధునిక టెక్నాలజీ ఆధారిత దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీసీ కెమెరా విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా కోర్టుకు పంపడం వంటి అంశాలను అధికారులు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో డ్రగ్స్ రవాణా, అక్రమ కార్యకలాపాలు, రౌడీషీటర్ల చెర నుంచి ప్రజా భద్రత కోసం నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. యువతను డ్రగ్స్ ప్రమాదాల నుంచి దూరంగా ఉంచేందుకు కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
పోలీసులు ప్రజలకు అండగా నిలిచి, బాధితులకు వెంటనే సహాయం అందించేందుకు స్పందనశీలత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసింగ్ అంటే కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే సేవా ధృక్పథం ఉండాలని చెప్పారు.
తనిఖీలో సిబ్బంది హాజరు, ఆయుధాల సంరక్షణ, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటి విభాగాలపై ఆయన ప్రత్యేక సూచనలు చేశారు.
అదిలాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ, సీఐ, ఇతర సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు.
News
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం
పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా
జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.
బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
crime
అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)
అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.
2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
Devotinal
కొండగట్టు హనుమాన్ జయంతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కొండగట్టు, బిబిఎంఏ న్యూస్:
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
