india

గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు?

Published on May 17, 2026 at 11:21 PM

1,519 Views

Quick Summary:

అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది.

గోవా దక్షిణ ప్రాంతం అంచున పొడవాటి ఇసుక తీరరేఖలో నెలవంక ఆకృతిలో ఉండే పాలోలెమ్ బీచ్ వద్ద మధ్యాహ్న సమయమైంది. భానుడు భగభగలాడి పోతున్నాడు. అయినా సముద్రంలో పర్యటకుల హుషారును ఆ ఎండ ఏమాత్రం ఆపలేకపోతోంది.భారతదేశపు పార్టీ రాజధానిగా తరచూ పిలిచే గోవాలో బీచ్ వైపుండే గుడిసెల్లాంటి తాత్కాలిక వసతి గృహాలు, తక్కువ ఖర్చుతో దొరికే హోటళ్లు పర్యటకులతో నిండిపోయాయి.

అయితే కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఇక్కడ వచ్చిన మార్పేంటంటే ఒకప్పుడు పాలోలెమ్‌తో పాటు గోవాలోని ఇతర బీచ్ గ్రామాల్లో యూరోపియన్లు, రష్యన్లు ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు ఆ పర్యటకులు కనిపించడం లేదు.ఇక్కడ ఉన్నవారంతా దాదాపుగా దేశీయ పర్యటకులే. ఇది గమనిస్తే విదేశీ పర్యటకులకు గోవాపై ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది.అయితే దేశీయ పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా గోవాపై ఆకర్షణ పెరిగింది.

మారుమూల ప్రాంతాల నుంచి గోవాకు పర్యటకులు

గోవా పర్యటకశాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2017లో గోవాను దాదాపు 9 లక్షలమంది విదేశీ పర్యటకులు సందర్శించారు. 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 5 లక్షలకు పడిపోయింది. 2016లో దేశీయ పర్యటకుల సంఖ్య 68 లక్షలుంటే, గత ఏడాది వారి సంఖ్య కోటి దాటింది.

ప్రపంచ భౌగోెళిక రాజకీయ పరిస్థితులు విదేశీ పర్యటకులపై ప్రభావం చూపుతున్నాయని గోవా పర్యటక శాఖ ఇటీవల తెలిపింది.'భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు మేం ఒకవైపు నిరాశగానూ, మరోవైపు ఆశావాదంతోనూ ఉండాల్సి వస్తోంది’’ అని గోవా పర్యటక మంత్రి రోహన్ ఖాంటే స్థానిక మీడియాకు చెప్పారు.

అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది. 1960లు, 1970లో హిప్పీల సంస్కృతి ప్రాచుర్యంలో ఉన్న కాలం నుంచే తక్కువ ఖర్చుతో కూడిన విహార కేంద్రంగా గోవాను ఇష్టపడుతూ వచ్చిన విదేశీ పర్యటకులు ఇప్పుడెందుకు దూరమవుతున్నారు?

ప్రజల పరిస్థితి బాలేదు. ముందు కోవిడ్, తర్వాత యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు మిడిల్ఈస్ట్ పరిణామాలతో విమాన ప్రయాణం బాగా ఖరీదైన వ్యవహారంగా మారింది. కాబట్టి డబ్బు ప్రభావం చాలా ఉంది'' అని ఐదోసారి గోవా పర్యటనలో ఉన్న రష్యన్ బ్యాలే డ్యాన్సర్ సోఫీ చెప్పారు.

''నా స్నేహితుల్లో కొందరు ఈ ఏడాది గోవా కాకుండా తుర్కియే లేదంటే ఈజిప్టు వెళ్తున్నారు. అవి మాకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చులో వెళ్లగలిగే అవకాశం ఉండడం ఇందుకు కారణం'' అని ఆమె అన్నారు.

గత 20 ఏళ్ల నుంచి న్యూకాజిల్ నుంచి గోవా వస్తున్న రికో కూడా యూరప్ పర్యటకుల గురించి ఇలాగే చెప్పారు.''మా దేశంలో ప్రస్తుతం విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టడానికి ఎక్కువ డబ్బు లేదు. గత మూడేళ్లగా పర్యటకులు సొంత దేశంలోనే సెలవులు గడపడానికే మొగ్గు చూపుతున్నారు'' అని ఆయన తెలిపారు.

''వీసా ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడం, అలాగే ఐదేళ్ల వీసా ఖర్చులు పెరగడం కూడా పర్యటకుల సంఖ్య తగ్గడానికి కారణమని బీబీసీతో మాట్లాడిన వాళ్లలో సగం మందికిపైగా అభిప్రాయపడ్డారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com